'భక్త కన్నప్ప' షూటింగ్ను బాపు ఎక్కడ, ఎలా చేశారో తెలుసా?!
on Dec 15, 2021
రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్లో మైల్స్టోన్స్ అనదగ్గ చిత్రాల్లో ఒకటి 'భక్త కన్నప్ప'. లెజెండరీ డైరెక్టర్ బాపు తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ బ్యానర్పై కృష్ణంరాజు స్వయంగా నిర్మించారు. కృష్ణంరాజు సరసన వాణిశ్రీ నటించారు. 10 లక్షల రూపాయల బడ్జెట్ అంటేనే ఎక్కువ అనే కాలంలో ఈ సినిమా కోసం ఏకంగా 20 లక్షలు ఖర్చు పెట్టారు. అందులో సెట్స్ నిర్మాణం కోసమే 9 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. సినిమాలోని కైలాసం ఎపిసోడ్ మినహా మిగతా సన్నివేశాల్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ, గూటాల, బుట్టాయగూడెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు బాపు.
Also read: శారద ఒక సీన్ చేయడానికి 20 టేకులు తీసుకున్నారంటే సర్ప్రైజ్ అవ్వాల్సిందే!
ఆ రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యాలు కానీ, ఇతర సౌకర్యాలు కానీ లేని మారుమూల గ్రామం బుట్టాయగూడెంలో రెండెకరాల స్థలంలో రెండు వేల తాటిచెట్లు కొట్టించి, వాటిని సగానికి కట్ చేసి వాటితో బోయవాళ్ల కోటను నిర్మించడం చిన్న విషయం కాదు. బుట్టాయగూడెం కానీ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ షూటింగ్ చెయ్యాలంటే.. అక్కడకు వెళ్లడానికి సరైన రోడ్లు లేవు. అందుకే షూటింగ్ లొకేషన్కు రోడ్లు కూడా బాపు బృందమే వేసుకుంటూ వెళ్లింది. అక్కడ సుమారు 50 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఏమాత్రం ఇబ్బంది అనుకోకుండా యూనిట్ మొత్తం ఓ పిక్నిక్లా దాన్ని ఆస్వాదించింది.
Also read: ముచ్చర్ల అరుణ పెళ్లి ఎవరితో, ఎలా జరిగిందో తెలుసా?
గోదావరి మధ్యలో ఉన్న పట్టిసీమ గుడిలో ఐదు రోజులు షూటింగ్ జరిపారు. ధవళేశ్వరం నుంచి పంటు (మరబోటు) తెప్పించి, అందులో జనరేటర్ను తీసుకెళ్లి షూటింగ్ నిర్వహించారు. ఈ ఐదు రోజూలూ యూనిట్ సభ్యులకే కాకుండా, షూటింగ్ చూడ్డానికి వచ్చిన వాళ్లకు సైతం భోజనాలు పెట్టడం ఓ విశేషంగా చెప్పుకున్నారు. 1976 మే నెలలో విడుదలైన 'భక్త కన్నప్ప'ను చూసేందుకు జనం తండోపతండాలుగా థియేటర్లకు తరలి వచ్చారు. ఆ రోజుల్లోనే సూపర్ హిట్టయిన ఆ చిత్రం తర్వాత కాలంలో తెలుగులోని క్లాసిక్స్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దర్శకుడిగా బాపు ఖ్యాతిని మరింతగా పెంచింది.
Also Read